హైదరాబాద్ : గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యం నేడు పల్లెల్లో కనిపిస్తోందని ఖానాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. తన ప్రసంగాన్ని లంబాడీ భాషలో కొనసాగించారు. మధ్యలో తెలుగు మాట్లాడుతుండగా.. లంబాడీ భాషలోనే మాట్లాడాలని ఆమెను స్పీకర్ పోచారం ప్రోత్సహించారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీరాజ్ పద్దులపై ఎమ్మెల్యే రేఖా నాయక్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ వల్లే తండాలు నేడు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గాంధీజీ, సేవాలాల్ ఆదర్శాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. గాంధీ, సేవాలాల్ మాదిరిగా సీఎం కేసీఆర్ కనిపిస్తున్నారు.
గిరిజన తండాలు, గూడెలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇప్పుడు అధికారులు తండాలకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో తండాల్లో సీజనల్ వ్యాధులు పూర్తిగా నివారించగలిగామని తెలిపారు. గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకురాళ్లు ఇందిరాగాంధీ, గీతారెడ్డి, రేణుకా చౌదరి తండాల్లో పర్యటించేవారు.. కానీ ఆడబిడ్డలు నీళ్ల కోసం పడుతున్న కష్టాలను పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ తండాలకు కూడా మిషన్ భగీరథ కింద సురక్షితమైన తాగునీరును సరఫరా చేస్తున్నారని స్పష్టం చేశారు. తండాలకు, గూడేలకు త్రీ ఫేజ్ కరెంట్ అందించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు.