దగ్గరుండి వివాహం జరిపించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు
నర్సంపేట క్యాంపు కార్యాలయం వేదిక..
ఘనంగా ప్రతిభ-రఘు పెండ్లి వేడుక
వధూవరులకు నూతన వస్ర్తాలు అందజేసి ఆశీర్వాదం
70 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నర్సంపేట, జూన్ 23 : ఎమ్మెల్యే పెద్ది దంపతులు అన్నీ తామై ఓ పేదింటి యువతి పెండ్లి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు క్యాంపు కార్యాలయం వేదిక కాగా, యువతికి చీరెసారె పెట్టి సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన మైదం మల్లేశ్- రాధ కుటుంబ దీనస్థితిని జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న గమనించి వారి కూతురు ప్రతిభ వివాహాన్ని తామే జరిపిస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పెద్ది దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గురువారం వరంగల్కు చెందిన రఘుతో ప్రతిభ పెళ్లి ఘనంగా నిర్వహించారు. పెద్ది దంపతులు సొంత ఖర్చుతో దగ్గరుండి పెళ్లి తంతు జరిపించి వధూవరులకు నూతన వస్ర్తాలు పెట్టి ఆశీర్వదించారు. చెన్నారావుపేట ఎంపీపీ విజేందర్, జడ్పీటీసీ పత్తినాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్న, బుర్రి తిరుపతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, నెక్కొండ ఎంపీపీ రమేశ్, నల్లా మనోహర్రెడ్డి, నాగిశెట్టి ప్రసాద్, మండల శ్రీనివాస్, దేవోజు సదానందం, దార్ల రమాదేవి, కోనాపురం సర్పంచ్ వెల్దె సుజాత, ఎంపీటీసీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు వరం.. సీఎంఆర్ఎఫ్
సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 70 మంది లబ్ధిదారులకు రూ. 31.15 లక్షల విలువైన ముఖ్యమం త్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా పెద్ది మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నట్లు వివరించారు. మారుమూల పల్లెల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం హెల్త్ సబ్ సెంటర్లను ప్రారంభిస్తున్నదని తెలిపారు. గతంలో డయాలసిస్ కేంద్రాలు నగరాలకే పరిమితమయ్యేవని, నేడు నియోజకవర్గ స్థాయి దవాఖానల్లో సైతం అందుబాలులోకి వచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద రూ. 50 కోట్లకు పైచిలుకు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న తదితరులు పాల్గొన్నారు.
బీమా చెల్లింపు..
నల్లబెల్లిలో ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందించారు. రేలకుంట గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న పోరిక వెంకటేశ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి కుటుంబానికి బీమా సొమ్ము కింద రూ.2 లక్షలు చెల్లించారు.
దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం..
దుగ్గొండి : దళితుల ఆర్థికాభివద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది చెప్పారు. రేఖంపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు, మంద శ్రీనివాస్ దళితబంధు యూనిట్లో భాగంగా తీసుకున్న కారు పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈసందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. దళితబంధు పథకం నిరంతరం కొనసాగుతుందని, దశల వారీగా అర్హులకు యూనిట్లు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో శివాజీ నగర్ సర్పంచ్ లింగంపల్లి ఉమారవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు..
– ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే పెద్ది
ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మండలంలోని ముద్దునూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ముదిరాజ్లు సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.3లక్షలు, ఎమ్మెల్సీ నిధుల కింద రూ. 2లక్షలు మంజురు చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, సర్పంచ్ రేవూరి సురేందర్రెడ్డి, ఎంపీటీసీ కొంగర అరుణారవి, ముదిరాజ్ సంఘం నాయకులు పొన్నం మొగిలి, పల్లె రమేశ్, బుస్సాని రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.