జమ్మికుంట: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కోరారు. శుక్రవారం ఆయన జమ్మికుంట పట్టణంలోని 8, 22 వ వార్డుల్లో పర్యటించారు. స్థానిక కాలనీవాసులను కలిశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పరిష్కార మార్గాలు చూపారు. అనంతరం ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ… జమ్మికుంట అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధుల వరద పారిస్తున్నరని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. ఎన్నికల్లోపు పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గతంలో మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ ఇక్కడి అభివృద్ధిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయన కుట్రలను భగ్నం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ అండగా నిలువాలని కోరారు. ఆయన వెంట ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులున్నారు.