నారాయణఖేడ్, జూలై 21: మన ‘ఊరు- మనబడి’లో భాగంగా ఆయా పాఠశాలల్లో పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ శరత్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి కలెక్టర్ నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూకల్ శివారులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పలుఅంశాలపై చర్చించారు.
మన ‘ఊరు- మనబడి’ పనుల్లో ఏవైనా అవాంతరాలు ఎదురైన పక్షంలో ఎంపీడీవో, ఎంఈవో, పంచాయతీరాజ్ అధికారులు కలిసి సమన్వయంతో పనులు ముందుకు సాగేలా చూడాలన్నారు. పలు పాఠశాలల్లో ఎస్ఎంసీ చైర్మన్లు సహకరించడం లేదని అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అవసరమైతే ఎస్ఎంసీ చైర్మన్ను మార్చి పనులు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యం తగదన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన చేపట్టి రెండు నెలల్లోగా పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు చేస్తున్న పొరపాట్ల వల్ల కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులకు గురవుతున్నారని, బిల్లుల చెల్లింపు విషయంలో వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడాప్రాంగణాల కోసం స్థలాల ఎంపిక విషయంలో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి మాట్లాడుతూ పలు గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతున్నదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆయా భూముల వివరాలు తనకు అందజేసిన పక్షంలో తానే స్వయంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, డీపీవో సురేశ్ మోహన్, డీసీవో ప్రసాద్, పీఆర్ ఈఈ అంజయ్య, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ ఫణివర్మ, తహసీల్దార్ దశరథ్ సింగ్, ఎంపీడీవో వెంకటేశ్వర్రెడ్డి ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.