హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల పక్షాన సీఎం కేసీఆర్కు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2014కు ముందు సింగరేణి లాభాల్లో 18 శాతం ఉన్న కార్మికుల వాటా ఇప్పుడు 30 శాతం పెరిగిందన్నారు. దేశంలో ఏ సంస్థ ఈ స్థాయిలో వాటా ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే సింగరేణి రూ. 32 వేల కోట్లకు పైగా టర్నోవర్ సాధించిందన్నారు. కార్మికుల సంక్షేమంలో సింగరేణి అత్యున్నత స్థానంలో ఉందని తెలిపారు. 9 వేల మంది కార్మికుల సర్వీసులను క్రమబద్దీకరణ చేసిందని గుర్తు చేశారు. కార్మికుల సొంత ఇంటి నిర్మాణానికి వడ్డీ లేని రుణం సర్కార్ ఇస్తోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని బాల్క సుమన్ ధ్వజమెత్తారు.