హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొత్త టాకీసులో పాత సినిమాలా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ (Balka Suman) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. దాదాపు ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించాయని, ఇప్పుడు ఆ రెండు పార్టీల నుంచి విముక్తి కలగాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జైపాల్ యాదవ్, అబ్రహంతో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీలు రాష్ట్రంపై దండయాత్ర చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో గుణాత్మక మార్పుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టడం ఆ పార్టీలకు రుచించడం లేదన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం కొట్లాడింది టీఆర్ఎస్ అని, చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ అని బాల్క సుమన్ చెప్పారు. ఉద్యమకారులపై నిర్బంధం విధించారని, బైండోవర్ కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఏనాడైనా ఉద్యమంలో కనిపించని.. చంద్రబాబుకు ఏజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి, ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు తెలంగాణకు మంచి చేస్తారట అని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ సభలో స్టేజి మీద ఉన్నోడు ఒక్కడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేడని విమర్శించారు. ఒక్కరు కూడా అమర వీరులను స్మరించుకోలదన్నారు. తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారా అని అడిగారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ హయాం మొత్తం కుంభకోణాల మయమని చెప్పారు.
బీజేపీ నడ్డా సభలో కూడా ఒక్కడు కూడా ఉద్యమంలో లేడన్నారు. బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా, ఆయనపై ఒక్క కేసైన ఉందా అని ప్రశ్నించారు. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల వేలంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.