ఐనవోలు, సెప్టెంబర్ 26: సబ్బండ వర్గాల సంతోషమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. సోమవారం మండలంలోని పున్నేలు, పంథిని, పెరుమాండ్లగూడెం, కక్కిరాలపల్లి, నందనం గ్రామాలకు చెందిన 685 మందికి లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులు, 6,275 మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సుమారుగా రూ.6కోట్లతో చేపట్టనున్న శ్మశానవాటిక, డంపింగ్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్స్, పల్లె ప్రకృతి వనాలు, గ్రామీణ క్రీడామైదానాలు, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు జనం మంగళహారతులతో నీరాజనం పలికారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలందరికీ ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తోందన్నారు. మండల వ్యాప్తంగా 17వేల 047 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం రూ.12వేల కోట్లు పింఛన్లుగా పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. ఆసరా పింఛన్ల సంఖ్య అర కోటికి చేరిందన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఇస్తున్న దాఖలాలు లేవన్నారు. వృద్ధాప్య పింఛన్ల వయస్సు 65 ఏళ్ల నుంచి 57ఏళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 10లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. కాగా, కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అరూరిపై పెరుమాండ్లగూడెం గతంలో వ్యహరించిన తీరుకు స్థానిక సర్పంచ్ పిడుగు రజిత గ్రామస్తుల తరఫున క్షమాపణ కోరారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే వివిధ పథకాల ద్వారా సుమారుగా రూ.4కోట్ల వరకు నిధులు కేటాయించి పనులు చేయించినట్లు తెలిపారు. నందనం గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే అరూరి ఆవిష్కరించారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్అలీ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బుర్ర రాజశేఖర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి రవీందర్, సర్పంచులు దేవేందర్, ప్రేమలత, రజిత, రమేశ్, మంజుల, ఎంపీటీసీలు అరుణ, సోమేశ్వర్రావు, అరుణ, రమేశ్, లక్ష్మి, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు పాల్గొన్నారు.