వర్ధన్నపేట, డిసెంబర్ 5 : గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా గృహాలను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని కడారిగూడెంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లులేని పేదలకు ప్రభుత్వం డబుల్బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తున్నదన్నారు. కానీ, గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేకపోవడంతో అనుకున్న మేర ఇళ్లను నిర్మించలేకపోయామన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలున్న పేదలకు వారి స్థలంలోనే ఇళ్లు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పేదలు ఇళ్ల నిర్మాణం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పేదలు ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకున్నట్లయితే సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, సర్పంచ్ మంద సతీశ్, కోఆప్షన్ సభ్యులు సహీమ్పాషా తదితరులు పాల్గొన్నారు.