DMK to Supreme Court | `ఉచిత` పథకాలు` వద్దంటూ దాఖలైన పిటిషన్ను సవాల్ చేస్తూ.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో తమిళనాడులో అధికార డీఎంకే పిటిషన్ దాఖలు చేసింది. `ఉచిత పథకాలు` చాలా విస్తృతమైనవని, `పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది` అని పేర్కొంది. ఎన్నికల వేళ ఉచిత పథకాలు ప్రకటించవద్దని, రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టదాయకం అని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను సవాల్ చేస్తున్నట్లు డీఎంకే తెలిపింది. ఉచిత పథకాలకు వ్యతిరేకంగా బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ను సవాల్ చేస్తూ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) పిటిషన్ దాఖలు చేసింది. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్లలో ఉచిత విద్యుత్, తాగునీరు సరఫరా చేస్తున్నది.
పార్టీలకతీతంగా ఎన్నికల వేళ ఉచిత పథకాలు ప్రకటిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఎన్నికలకు ముందు బట్టలు, ఆహారం, గృహోపకరణాలు పంపిణీ చేస్తుంటారు ఆయా పార్టీల అభ్యర్థులు.. నేతలు. ఒక్కోసారి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కూడా ఆయా పార్టీలు ఉల్లంఘిస్తుంటాయి. ఎన్నికల తర్వాత గెలుపొందిన ప్రభుత్వాలు ఆహారం, ఇతర వస్తువులపై భారీ సబ్సిడీలు ఇస్తుంటాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే జయలలిత సర్కార్ ప్రారంభించిన అమ్మ క్యాంటిన్లు ఎంతో పాపులర్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏకైక సంక్షేమ పథకాన్ని ఉచిత పథకంగా ధృవీకరించడం సరి కాదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన పిటిషన్లో వాదించారు. విదేశీ కంపెనీలకు ట్యాక్స్ హాలీడే .. తమకు సన్నిహితులైన కార్పొరేట్లకు రుణాల మాఫీ.. కీలక కాంట్రాక్ట్లు అప్పగిస్తున్న కేంద్రం.. సంక్షేమ పథకాలను ముట్టుకోజాలదన్నారు. రాజ్యాంగంలోని 38వ అధికరణం ప్రకారం సమాజంలో అసమానతలను తగ్గించేందుకు సంక్షేమ పథకాలు ఉపకరిస్తాయని డీఎంకే తన పిటిషన్లో పేర్కొంది.