హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ):దేశంలో నానాటికీ పెరుగుతున్న నూనెల దిగుమతిని తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా, ఆయిల్పామ్ ఉత్పత్తులకు మద్దతు ధరపై మీనమేషాలు లెక్కిస్తున్నది. హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ మద్దతు ధరకు సంబంధించి ఒక్క అడుగు ముందుకుపడలేదు. గతేడాది ఆగస్టులో ‘మిషన్ ఆయిల్పామ్’ అంటూ ఓ పథకానికి శ్రీకారం చుట్టి మద్దతు ధర నిర్ణయిస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.11 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది. ఏడాది దాటినా పథకానికి అతీగతీ లేకుండా పోయింది.
మద్దతుకు బదులు వీజీఎఫ్
ఆయిల్పామ్కు మద్దతు ధర నుంచి తప్పించుకొనేందుకు కేంద్రం వయబుల్ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) అనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. గత ఐదేండ్లలో ఆయిల్పామ్ ధరల సగటును లెక్కించి వీజీఎఫ్ ధర నిర్ణయిస్తారు. ఒకవేళ మార్కెట్ ధర వీజీఎఫ్ ధర కన్నా తక్కువ ఉంటే తక్కువైన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పెరుగుదలతో పోల్చితే తగ్గుదలే ఎక్కువసార్లు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు.. మార్కెట్లో ఆయిల్పామ్ గెల టన్ను రూ.13 వేలు ఉంటే వీజీఎఫ్ ధర రూ.10,250 ఉంది. ఈ లెక్కన మిగతా మొత్తం చెల్లించడంలో తాత్సారం అవుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరిగిన సాగు వ్యయం, కూలీ ధరలు, ఇతరత్రా ఖర్చుల నేపథ్యంలో ఆయిల్పామ్కు టన్నుకు రూ.20వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రోత్సహించే పద్ధతి ఇలానా ?
ఏటా 70 వేల కోట్ల విలువైన నూనెలను కేంద్రం దిగుమతి చేసుకుంటున్నది. దీంతో పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం వృథా అవుతున్నది. నూనె ఉత్పత్తి స్వయం సమృద్ధి సాధించేందుకు దేశవ్యాప్తంగా ఆయిల్పామ్ సాగు పెంచాలని నిర్ణయించింది.మద్దతు ధరపై చేతులెత్తేయడంతోపాటు విత్తనాల దిగుమతిపై భారీగా పన్ను పెంచడంతో వీటి దిగుమతి భారంగా మారింది. దీనిపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది.