గాంధారి: తెలంగాణలో హిందూ, ముస్లింలు కలిసి మెలిసి ఉంటూ భిన్నత్వంలో ఏకత్వంలా పండుగల్లోనూ తమ ఐక్యమత్యాన్ని చాటి చెపుతున్నారు. ఇటీవల దుర్గా నవరాత్రి ఉత్సవాలు కామారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగాయి. జిల్లాలోని గాంధారి మండలంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన లడ్డును ఓ మైనార్టీ సోదరుడు వేలంలో దక్కించుకుని మతసామరస్యాన్ని చాటాడు. గాంధారి మండల కేంద్రంలో శివహిందు సేనా యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత లడ్డును శనివారం రాత్రి వేలం వేశారు.
ఈ వేలంలో పాల్గొన్న మండల కేంద్రానికి చెందిన సయ్యద్ అల్తాఫ్ రూ.54వేలకు లడ్డును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా అతడిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండపం నిర్వహకులు గంగాప్రసాద్గౌడ్, గాండ్ల సాయిలు, మమ్మాయి భాస్కర్, తూర్పు సందీప్, రమేశ్, నాగభూషణం తదితరులు ఉన్నారు.