ఢిల్లీ ,జూన్ 1: ఈ-రవాణాను ప్రోత్సహించడానికి కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. బ్యాటరీ వాహనాల (బీవోఏ) నమోదు ధృవపత్రం (ఆర్సీ) జారీ చేయడానికి లేదా పునరుద్ధరణకు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రుసుమును మినహాయించే ముసాయిదా ప్రకటనను కేంద్ర రవాణామంత్రిత్వ శాఖ జారీ చేసింది. ‘కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989’కు సవరణ తెస్తూ, ఈ-రవాణాను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన పట్ల ప్రజలకుగానీ, సంబంధిత వర్గాలకుగానీ అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ప్రకటన విడుదలైన రోజు నుంచి 30 రోజులలోపు తెలియజేయాలని కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కోరుతున్నది.