హైదరాబాద్ : దేశంలో 43 మంది ప్రముఖులకు జెడ్ ప్లస్ భద్రత కల్పించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దేశంలో వీఐపీలు, వీవీఐపీలకు కొదవే లేదు. వ్యక్తిని బట్టి, హోదాను బట్టి భద్రత కల్పిస్తూ ఉంటారు. అయితే, అత్యున్నత భద్రతగా మాత్రం ‘జెడ్ ప్లస్’ను పిలుస్తుంటారు. జెడ్, వై ప్లస్ కేటగిరీల్లో ఎంత మందికి భద్రత కల్పిస్తున్నారు ? ఇందుకు ఎంత ఖర్చు చేస్తున్నారో వెల్లడించాలంటూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ (యాక్) సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్ర హోం శాఖను కోరింది. దీనికి కేంద్ర హోంశాఖ పీఐవో రాజీవ్ శర్మ సమాధానం ఇచ్చారని యాక్ వ్యవస్థాపకుడు పల్నాటి రాజేంద్ర తెలిపారు.
ప్రముఖ వ్యక్తులకు పొంచి ఉన్న ప్రమాదం ఆధారంగా వారికి ఎక్స్, వై, వై ప్లస్, జెడ్, జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 43 ప్రముఖులకు జెడ్ ప్లస్, 66 మందికి జెడ్, 81 మందికి వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. భద్రతపై సమీక్షిస్తూ మరింత పెంచడమో, తగ్గించడమో చేస్తామని పేర్కొంది. అయితే భద్రతకు చేసే ఖర్చుల వివరాలు పూర్తిగా తమ దగ్గర ఉండవని కేంద్ర హోం శాఖ పేర్కొన్నది. భద్రత సిబ్బంది వేతనాలు, ప్రయాణ భత్యాలు, వాహనాలు వంటి ఖర్చులను సందర్భాన్ని బట్టి వివిధ ఏజెన్సీలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రత పొందే వ్యక్తులు, సంస్థలు భరిస్తాయని పేర్కొన్నది. భద్రత పొందే ప్రముఖుల వివరాలను మాత్రం వెల్లడించలేమని స్పష్టం చేసింది.