హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్నగణేశ్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ హెలికాప్టర్లో బయలుదేరి జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ నిర్వహించారు.
మంత్రుల వెంట డీజీపీ మహేందర్రెడ్డి, నగర సీపీ అంజనీ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్లో నిర్వహించే గణపతి శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొంటారని ఆయన గుర్తు చేశారు. పార్వతీ తనయుడి శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు.