హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. 31వ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో నిరాదరణకు గురవుతున్నవారిని ప్రభుత్వ పరంగా ఆదుకొనేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఓల్డ్ ఏజ్ హోంలను (వృద్ధాశ్రమాలను) ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఆహ్లాదకర వాతావరణంలో వీటిని ఏర్పాటు చేసేందుకు నిధులు కూడా మంజూరైనట్టు చెప్పారు. వృద్ధుల కోసం ప్రత్యేక చట్టాలున్నాయని, వాటిపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత గురించి విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఈ చట్టాలను పాఠ్యాంశంగా పొందురుస్తామన్నారు.
వైద్య చికిత్సల కోసం ప్రభుత్వ దవాఖానలకు వచ్చే వృద్ధులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కొవిడ్తో మరణించినవారికి దగ్గరుండి దహన సంస్కారాలు జరిపించిన అన్నా ఫౌండేషన్ నిర్వాహకుడు అన్నా శ్రీనివాస్తోపాటు ఎటువంటి గౌరవ వేతనం తీసుకోకుండా విద్యాబోధన చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగి వెంకటాచారిని అభినందించారు. వందేండ్లు పైబడిన పలువురు వృద్ధులను సన్మానించారు. అనంతరం వృద్ధుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్ 14567 పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ టోల్ఫ్రీ నంబర్ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.