ధర్మారం : సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా బారినపడ్డ ఓ తల్లిని నవ మాసాలు మోసి, కనిపెంచిన పిల్లలే పట్టించుకోలేని పరిస్థితుల్లో.. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకొని చలించిపోయారు. వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయించి, కరీంనగర్ దవాఖానలో చేర్పించి వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఆదేశించారు. ధర్మారం దొంగతుర్తి గుండ గంగమ్మ పది రోజుల కిందట కరోనా మహమ్మారి బారినపడింది. అప్పటి నుంచి దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక్కతే ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉంటోంది. స్థానిక ఫొటోగ్రాఫర్ ఒకరు నిత్యం భోజనం అందిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించింది.
గంగమ్మకు నలుగురు బిడ్డలు ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వారికి సమాచారం అందించగా.. ఎవరూ ముందుకు రాలేదు. చుట్టుపక్కల ఉన్న వారు సైతం పట్టించుకోలేదు. ఆమె పరిస్థితిని వివరిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పట్టారు. ఇది గమనించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయించి, గంగమ్మను కరీంనగర్ దవాఖానకు తరలించారు. కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని తెలుసుకొని మహిళకు వైద్యసేవలందేలా చర్యలు తీసుకున్న మంత్రి ఈశ్వర్కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.