వరంగల్ : నగరానికి భద్రకాళి బండ్ తలమానికంగా నిలుస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మహానగర పాలక సంస్థ, కుడా సంయుక్తంగా భద్రకాళి బండ్ (ట్యాంక్బండ్)పై ప్రజల సందర్శనార్థం నిర్మించిన బయో డైవర్సిటీ కల్చరర్ పార్క్ను ప్రజల సందర్శనార్థం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రూ.30కోట్ల అంచనా వ్యయంతో బండ్ను నిర్మించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ బండ్ను అద్భుతంగా తీర్మిదిద్దినట్లు చెప్పారు.
కాకతీయుల కాలం నాటి కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, రామప్ప ఆలయానికి ఇటీవల ప్రపంచ వారసత్వ హోదీ లభించిందని చెప్పారు. ఇందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. ఖిలా వరంగల్, వెయ్యి స్తంభాల ఆలయం, లక్నవరం తదితర చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రూ.2500 కోట్లతో వరంగల్ నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
బండ్ను అద్భుతంగా తీర్చిదిద్దిన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, సీపీ డాక్టర్ తరుణ్ జోషి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.