వేల్పూర్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ యువతీ యువకుల కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఖర్చులతో వేల్పూరు మండలం పడిగల్, హనుమాన్నగర్(వడ్డెర కాలనీ) లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఉచిత శిక్షణ కోసం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సుమారు 500 మంది యువతీ యువకుల కోసం 3 నెలల పూర్తి శిక్షణతో పాటు ఉచిత మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.
దానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. శిక్షణ కేంద్రంలో తగు వసతులు ఏర్పాటు చేయాలని, వేడి నుంచి ఉపశమనం కోసం కూలర్లు సమకూర్చాలని నిర్వాహకులకు సూచించారు. ప్రతి రోజు వేల్పూరు మండలానికి చెందిన 16 గ్రామాల సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు కార్యర్తలు, పలువురు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వంతుల వారీగా మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చూసుకుంటామని చెప్పటం సంతోషకరం అన్నారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మీరు చేయాల్సింది ఉద్యోగం సంపాదించడమేనని, బాగా చదివి ఉద్యోగం పొందాలని మంత్రి సూచించారు.