మోర్తాడ్, మే 29: ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ కష్టమొచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా వెంటనే తీరుస్తున్నారు. అనారోగ్యం బారిన పడి ఆర్థిక స్థోమత లేనివారికి ఆర్థిక సాయం అందజేస్తున్నారు. బాధితులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) నుంచి కోట్లరూపాయల ఆర్థికసహాయాన్ని అందిస్తూ పేదకుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు.
పార్టీలకు అతీతంగా సాయాన్ని అందిస్తూ ప్రజల గుండెల్లోనిలుస్తున్నారు. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన పరుకుంట గంగాధర్కు రూ.2లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి సోమవారం అందజేశారు. గంగాధర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈవిషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి వేముల దృష్టికి తీసుకురాగా, నిమ్స్ దవాఖానలో చేర్పించడంతోపాటు రూ.2లక్షల ఎల్వోసీని మంజూరు చేయించారు. ఈ మేరకు హైదరాబాద్లో బాధితుడికి మంత్రి వేముల అందజేశారు. తనకు ఆర్థిక సాయం చేసిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని బాధితుడు గంగాధర్ పేర్కొన్నాడు.