కామారెడ్డి : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ అభివృద్ధి సృష్టికర్త అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీర్కూరు మండల కేంద్రం సమీపంలోని మంజీర నదిపై రూ. 48.50 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవల్ వంతెనను స్పీకర్ పోచారంతో కలిసి మంత్రి ప్రారంభించారు.
అనంతరం బీర్కూరు మండల కేంద్రంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ..స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభవృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని మంత్రి అన్నారు. మోదీ మాటలు తప్ప దేశాభివృద్ధికి చేసింది ఏమీ లేదని విమర్శించారు.
బీజేపీలో చేరకుంటే ఈడీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, బీజేపీలో చేరితే అన్ని కేసులు మాఫీ అవుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు.
వారి దుర్మార్గాలను కచ్చితంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీవో రాజా గౌడ్ పాల్గొన్నారు.