సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందింపచేయాలని, దేశ స్వతంత్ర చరిత్రను తెలియ జెప్పాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకే గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
15 రోజులపాటు నిర్వహించిన భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడానికి సహకరించిన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను శుక్రవారం మాసాబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ అనిల్కుమార్ కూర్మాచలం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఎఫ్డీసీ ఎండీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తాలతో కలిసి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బసిరెడ్డి, కార్యదర్శి దామోదర్ప్రసాద్, క్యూబ్, యూఎఫ్ఓ పీఎస్డీ డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను శాలువాతో సతరించి మెమొంటోలను అందజేసి ఘనంగా సన్మానించారు.
552 స్రీన్లలో 22.57లక్షల మంది విద్యార్థుల వీక్షణ
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజులపాటు రాష్ట్రంలోని 552 స్రీన్లలో చిత్రాన్ని ప్రదర్శించగా, 22.57 లక్షల మంది విద్యార్థులు వీక్షించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఈడీ కిశోర్ బాబు, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.