హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని రాజ్ భవన్ స్కూల్, అమీర్పేట ధరం కరం రోడ్లోని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మన బస్తీ-మన బడి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేడు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. జిల్లాలోని మొత్తం 690 పాఠశాలలు ఉండగా మొదటి విడుతలో భాగంగా 239 స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలోని 26,065 పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అన్ని వసతులు కల్పించేకుగాను మన ఊరు-మన బడి, పట్టణాల్లో అయితే మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. దీనికోసం రూ.7,259 కేటాయించారని వెల్లడించారు. మొదటి విడుతలో భాగంగా 9123 పాఠశాలల అభివృద్ధికి రూ.3,497 కోట్లు మంజూరు చేశారన్నారు.