హైదరాబాద్ : క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ గ్రౌండ్లో కాసాల రామస్వామి లక్ష్మీదేవి మెమోరియల్ ఆధ్వర్యంలో బాలుర, బాలికల వాలీబాల్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి చెందామని అధైర్యపడకుండా విజయం సాధించేందుకు మరింత శ్రమించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలన్నారు. యువత క్రీడల్లో రాణించాలని అన్నారు. అనంతరం పోటీల్లో గెలిచిన జట్లకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో విజయానందు, దినేష్, భీమ్ రావ్, రామానంద్ తదితరులు పాల్గొన్నారు.