హైదరాబాద్: అమ్మవారి చెంత రాజకీయాలు మాట్లాడటం తగదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. లష్కర్ బోనాల సందర్భంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకున్న కొందరు నాయకులు.. మీడియా పాయింట్లో రాజకీయాలు మాట్లాడారని, ఇది సరైంది కాదని చెప్పారు. వాళ్లకు పార్టీ కార్యాలయాలు ఉన్నాయని, అక్కడ మాట్లాడుకోవాలన్నారు. ఇకనుంచైనా ఈ పద్ధతి మానుకోవాలని మంత్రి సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. ఫలహారం బండిల ఊరేగింపు కూడా బ్రహ్మాండంగా జరిగిందన్నారు. అమ్మవారి బోనాల జాతరని ప్రశాంతంగా, గొప్పగా నిర్వహించుకున్నామని, ఇందుకు సహకరించిన స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీకి, భద్రత ఏర్పాటు చేసిన పోలీసులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.