హైదరాబాద్ : బీజేపీ నేతలకు మెదడు లేదు.. కాంగ్రెసోళ్లకు అతీగతీ లేదు అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బడ్జెట్లో అణగారిన వర్గాలకు న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్ ఆవేదనతో మాట్లాడారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం అవసరమని కేసీఆర్ అన్నారు. ఇక ఆ మాటలను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వక్రీకరించి వివాదం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని కోపోద్రిక్తులయ్యారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద మాట్లాడకుండా కాంగ్రెస్, బీజేపీలు కొత్త రాజ్యాంగ ప్రతిపాదన మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. బడ్జెట్లో తెలంగాణకు ఏం ఇచ్చారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలి. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎక్కడున్నాయో కిషన్ రెడ్డి చెప్పాలి అని తలసాని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డి.. ఈ మూడేండ్లలో ఒక్క లక్ష రూపాయాలైన తెచ్చిండా? అని నిలదీశారు.
భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించిన అరుణ్ శౌరీని కేంద్రమంత్రిగా చేసింది బీజేపీ కదా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. వాజ్ పేయి హాయంలో రాజ్యాంగాన్ని సమీక్షించేందుకు కమిషన్ వేయలేదా? అని అడిగారు. బీజేపీ కి పబ్లిసిటీ పిచ్చి పట్టింది. సోషల్ మీడియా, మీడియాలో కనిపించేందుకు ఇష్టమొచ్చిన్నట్లు వాగుతున్నారు. బీజేపీ నేతలు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.