శంషాబాద్ రూరల్: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పతకాలతో సత్తాచాటిన రాష్ట్ర ప్లేయర్లకు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజకు క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ సాదర స్వాగతం పలికారు. క్రీడాభిమానుల సందోహం మధ్య శ్రీజను ఆయన సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పాటుపడుతున్నాం. అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన ప్లేయర్లకు సముచిత రీతిలో నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీటీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు శ్రీజను సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి అభినందించారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న పీవీ సింధు, సాత్విక్సాయిరాజ్, గాయత్రి గోపీచంద్, లక్ష్యసేన్కు ఫ్యాన్స్ స్వాగతం పలికారు.