న్యూ ఢిల్లీ : చిత్రసీమలో తెలంగాణ కీర్తిని జాతీయస్థాయిలో చాటి చెప్పిన గొప్ప నటుడు పైడి జయరాజ్ అని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పైడి జయరాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బాలీవుడ్లో అగ్ర హీరోగా రాణిస్తూ దర్శకునిగా, నిర్మాతగా, బహుభాషా నటుడిగా గుర్తింపు పొంది ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి తరం తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జైరాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కవులను, కళాకారులను, సాహితివేత్తలను, గుర్తించి వారిని గౌరవిస్తున్నారన్నారు.
జయరాజ్ సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కళావేదిక రవీంద్రభారతిలో ఉన్న ప్రివ్యూ థియేటర్ కి ‘పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్’ పేరు పెట్టుకొని గౌరవిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, భాగ్యనగర్ టీఎన్జీవో అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.