మహబూబ్నగర్ : బసవేశ్వరుడి చరిత్ర చదివిన ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పు వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకుని ఉన్న జీవితమయినా చక్కని మార్గంలో పయనించేలా బసవేశ్వరుడు స్ఫూర్తిని నింపుతాడన్నారు. మహబూబ్నగర్ జిల్లా వీరన్నపేటలో బసవ భవన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మనుషులందరూ ఒక్కటేనని, దేహమే దేవాలయమని బోధించిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడని కొనియాడారు.
స్త్రీ, పురుష భేదం ఉండకూడదని ఆ మహనీయుడు సూచించాడన్నారు. శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని బోధించాడని పేర్కొన్నారు. హైదరాబాద్లో సుమారు రూ.100కోట్ల విలువైన భూమిని, రూ.10కోట్ల నిధులను బసవ భవన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటి బసవ భవన్ను స్థానికంగా ఏర్పాటు చేసుకునడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.