లింగోజిగూడెం / చౌటుప్పల్ టౌన్ : మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారని, దీంతో ఈ ప్రాంతానికి ఇక తిరుగుండదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజీగూడెంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఆర్ఎస్ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు తమను ఎక్కడ తరుముతారోనని భయపడి ప్రచారం చేపట్టేందుకు ప్రతిపక్షాలు జంకుతున్నాయన్నారు. రైతుబంధు రైతుబీమా, మిషన్ భగీరథ, పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓట్లు అడిగేందుకు వెళితే తమను ఎక్కడ కొడుతారోనని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందినా.. అధికార పార్టీ ఎమ్మెల్యే లేనందున ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. భవిష్యత్లో తిరుగులేనివిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి చేసేవాళ్లు అధికారంలోకి రావాలో.. కులం మతం పేరిట చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించే వాళ్లు అధికారంలోకి రావాలో జనం జాగ్రత్తగా ఆలోచించాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రికి స్థానికులు నీరాజనం పలికారు. జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై టీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలువురు నేతలు పాల్గొన్నారు.