మహబూబ్నగర్ : ప్రపంచంలో ఎక్కడలేని విధంగా వంట గ్యాస్ ధరలు మన దేశంలోనే ఆకాశాన్నంటాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. వంట గ్యాస్ ధరలు తగ్గించకపోతే మరో పోరాటం తప్పదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఎనిమిదేండ్లలో వంట గ్యాస్ ధరలు నాలుగు రెట్లు పెంచి పేదల నడ్డి విరిచారని మండిపడ్డారు. వంట గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు.
ఈ ఎనిమిదేండ్లలో గ్యాస్ ధరలు దాదాపు నాలుగు రెట్లు పెంచారని తెలిపారు. 2014లో రూ.450 ఉండగా ఇప్పుడు రూ. 1100 కు పైగా దాటిందని గుర్తు చేశారు. సబ్సిడీగా ఇస్తున్న రూ.240ను కూడా దశలవారీగా ఎత్తేసి పేదలపై ఊహించని భారం మోపారని మంత్రి మండిపడ్డారు. కూలీలు, చిరుద్యోగులు తాము సంపాదించిన దాంట్లో కనీసం 10 శాతానికి పైగా వంట గ్యాస్, పెట్రోల్కే ఖర్చు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. కేంద్రం ప్రజా వ్యతిరేక పాలనపై రాష్ట్రాలు ప్రశ్నిస్తే, బెదిరింపులకు పాల్పడుతూ ఈడీ ద్వారా వేధింపులకు గురి చేస్తూ నోరెత్తకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు కొరమోని నరసింహులు, బస్వరాజు గౌడ్ లక్ష్మీ, మూడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, డిసిసిబి వైస్ చైర్మన్, కొరమోని వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, మత్స్య సహకార సంఘం చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్, పార్టీ నాయకులు వినోద్, శివరాజు తదితరులతో పెద్ద ఎత్తున మహిళలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.