హైదరాబాద్ : బంజారాహిల్స్లోని ఓ ప్రయివేటు స్కూల్లో నాలుగున్నరేండ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఆ ప్రయివేటు స్కూల్ ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజనీకుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యం, సిబ్బందిపై కూడా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ ఘటనలో ఇప్పటికే రజనీకుమార్ను అరెస్టు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. స్కూల్ ఇంచార్జి, టీచర్ నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటుచేసుకుందని దీంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.