సంస్థాన్ నారాయణపురం: రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పోర్లగడ్డ తండాకు మొదటిసారి బస్సు వచ్చింది. దీంతో గిరిజన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా పోర్లగడ్డ తండాకు మంత్రి సత్యవతి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా గడపగడపకు ప్రచారం నిర్వహించి అక్కడి గిరిజన ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.
ఈ క్రమంలో గ్రామానికి బస్సు లేక ప్రజలు, కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ తండా వాసులు మంత్రి ముందు వాపోయారు. స్పందించిన మంత్రి ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి తక్షణమే బస్సు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇబ్రహీంపట్నం నుంచి పోర్లగడ్డ తండా వరకు బస్సును ఏర్పాటు చేయించారు. మొదటి సారి తండాకు బస్సు రావడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 60ఏండ్ల సమస్యను రెండు రోజుల్లోనే పరిష్కరించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ అరుణేష్, వైస్ ఎంపీపీ రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు కుమార్, వార్డ్ మెంబర్స్ సభవత్ రాజు, మాజీ సర్పంచ్ బిచ్చ నాయక్, తండా ప్రజలు పాల్గొన్నారు.