హైదరాబాద్ : జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన కొమురం భీమ్ ఆదివాసీల ఆరాధ్యదైవం అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కొమురం భీమ్ 121వ జయంతి సందర్భంగా మాసబ్ ట్యాంక్లోని డీఎస్ఎస్ భవన్లో మంత్రి సత్యవతి రాథోడ్ ఆయన చిత్రపటానికి శనివారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కొమురం భీమ్ చిన్ననాటి నుంచే పోరుబాట పట్టి, ప్రజల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, బానిసత్వపు సంకెళ్లు తెంచడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులని కొనియాడారు. కొమురం భీమ్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు.
ఆదివాసీ యోధుడు కొమురం భీమ్ ఆశయాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని తెలిపారు. మా తండాలో మా రాజ్యం అన్న ఆయన నినాదాన్ని నిజం చేసింది కేసిఆర్ సర్కార్ అని స్పష్టం చేశారు. తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న సుదీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చి గిరిజనులకు తండాలో పాలనాధికారాన్ని అందించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని తెలిపారు. బంజారా హిల్స్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ. 21.50 కోట్లతో కొమురం భీమ్ ఆదివాసీ ఆత్మగౌరవ భవన్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతిని ప్రదర్శించేందుకు, సభలు, సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం ఈ భవన్ నిర్మించడం జరిగిందని చెప్పారు. కొమురం భీమ్ అడవిబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక అని, ఆయన జయంతి సందర్భంగా గిరిజనులు ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పీసీసీ ఎఫ్ దోబ్రియల్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్రెడ్డి, ట్రైకర్ జిఎం శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.