హైదరాబాద్ : తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న గిరిజనుల జీవిత కాల, ఆశ, ఆకాంక్షను నెరవేర్చి 9 వేల గ్రామ పంచాయతీలను 12వేలకు పెంచి ఆ గ్రామ పంచాయితీల అభివృద్ధికి జనాభా దామాషా ప్రకారం నిధులు ఇస్తూ…500 జనాభా కన్న తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు, తండాలకు 5 లక్షల రూపాయలకు తగ్గకుండా నిధులు ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులతో పాటు గిరిజన ప్రత్యేక ప్రగతి నిధి కింద అదనపు నిధులు ఇచ్చి గిరిజన గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గిరిజన ఉప ప్రణాళిక, గిరిజన తండాలు, గ్రామ పంచాయతీల నిర్వహణకు నేరుగా 5 శాతం నిధులు ఇస్తున్నారా? అంటూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సమాధానం చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 2014 నుంచి 2016 వరకు మూడేళ్ల పాటు గిరిజన ఉప ప్రణాళిక ఉందని, దీనిలో ఉన్న కొన్ని లోపాల వల్ల గిరిజనులకు అందాల్సిన నిధులు పూర్తి స్థాయిలో అందడం లేదని, ఖర్చు చేయకపోతే మురుగి పోతున్నాయని భావించి, ఇకపై అలా మురిగిపోకుండ ఉండాలని 2017 నుంచి గిరిజన ప్రత్యేక ప్రగతి నిధిని తీసుకు వచ్చారని చెప్పారు.
గిరిజన ఉప ప్రణాళిక కింద మూడేళ్ల సమయంలో 15,766.64 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. 2017 నుంచి గిరిజన ప్రత్యేక ప్రగతి నిధిలో 34,815.14 కోట్ల రూపాయలు కేటాయించి మొత్తంగా 7 ఏళ్లలో 50581.78 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో గిరిజన జనాభా కంటే కూడా ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు.
కేంద్రం ఇచ్చే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నామని, గిరిజన గ్రామాల్లో పల్లె ప్రగతిలో నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసుకుంటూ గిరిజనుల ఆత్మ గౌరవం పెరిగేలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. అంతే కాకుండా గిరిజన గ్రామ పంచాయతీలను తామే పాలించుకొని అభివృద్ధి చేసుకోగలమని గిరిజన సర్పంచ్ లు నిరూపిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.