హైదరాబాద్: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi rathod) శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. సంఘటిత, అసంఘటిత రంగాలనే తేడా లేకుండా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని వెల్లడించారు. నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమానికి బోర్డు ద్వారా గతేడాది రూ.176.91 కోల్లు లబ్ది చేకూర్చామన్నారు. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా 32,350 మంది కార్మికులకు రూ.184.07 కోట్ల మేర ప్రయోజనం లభించిందన్నారు.
కార్మికశాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్లైన్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక జాతీయ అవార్డులను కైవసం చేసుకుందని, కార్మికులకు ఎక్కడి నుంచైనా ప్రభుత్వ సహకారం పొందే అవకాశం లభించిందని మంత్రి చెప్పారు.
దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావడం వల్ల అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలు మన వద్దకు వస్తున్నాయని, తద్వారా కార్మికులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉపాధి, వేతనం లభిస్తున్నదని పేర్కొన్నారు.