హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఉలుకు పలుకు లేదని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గత ఐదేండ్ల నుంచి అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ స్పందించడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, రాష్ట్రంలోని గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రిజర్వేషన్లను పెంచకపోవడంతో ఉద్యోగాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లో గిరిజనులు నష్టపోతున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఇవాళ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఈ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా కేటాయించిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్రం స్పందించడం లేదన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.