హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ బతుకమ్మ చీరల తయారీకి రూ.339 కోట్లు వెచ్చించి కోటి మంది అక్కాచెల్లెండ్లకు పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. చేనేత రంగాన్ని బతుకమ్మతో చేరదీసి ఆ రంగానికి ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం సారె పెట్టే సంస్కృతికి బాటలు వేసిన సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోని అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లి, తండ్రిగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. శిశువిహార్లో ఉన్న చిన్నారుల పట్ల బాధ్యతగా ఉంటూ వారిని సంరక్షిస్తూ పోషణను అందిస్తున్న సిబ్బందిని ఆమె అభినందించారు. రాష్ట్రంలోని అనాథ ఆశ్రమాలు, ఎన్జీవోస్.. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి మంత్రి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, జాయింట్ డైరెక్టర్లు సునంద, కేఆర్ఎస్ లక్ష్మీదేవి, రీజినల్ జాయింట్ డైరెక్టర్ శారద, రాష్ట్ర బాలల హకుల కమిషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.