మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఇవాళ సమీకృత మార్కెట్కు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కౌన్సిలర్ గోపీరత్నం, కలెక్టర్ వీపీ గౌతం, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ట్రైనీ కలెక్టర్ అగస్త్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. నేడు సమీకృత మార్కెట్కు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరైంది. జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాము. దీనికి ప్రజలు కూడా సహకరించాలన్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా కొన్ని కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇందులో ఎవరిని నొప్పించాలని, నష్ట పర్చాలనే ఉద్దేశ్యం లేదు. దయచేసి అందరూ అర్దం చేసుకోవాలని కోరుతున్నాను అని మంత్రి తెలిపారు.