హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని, దయచేసి ఆందోళన విరమించాలని విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్ను కూడా నియమించడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణను క్యాంపస్కు పంపించామని, వారితో కూడా చర్చించండి అని సబిత సూచించారు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ కమిటీ, యూనివర్సిటీ కమిటీ అంతర్గతంగా చర్చించుకొని, సమస్యలను పరిష్కారించుకోవాలని చెప్పారు. కొవిడ్ కారణంగా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులను సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంచుకొని, ఈ క్యాంపస్లో 1000 నుంచి 1500కు అడ్మిషన్స్ పెంచడం జరిగిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాసర ట్రిపుల్ ఐటీకి మంచి పేరుంది. అలాంటి యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలగవద్దని మాత్రమే కోరుతున్నాను. రాజకీయాలకు ఈ యూనివర్సిటీ వేదిక కావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఎండలో, వానలో కూర్చొని మీరు నిరసనలు చేస్తున్న దృశ్యాలను చూస్తుంటే.. ఓ మంత్రిగానే కాదు.. ఓ అమ్మగా బాధేస్తుందన్నారు. ఇది మీ ప్రభుత్వం.. దయచేసి ఆందోళనలు విరమించి, చర్చించండి.. మీ సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
బాసర IIIT విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి విజ్ఞప్తి. pic.twitter.com/87JtOvN9gq
— SabithaReddy (@SabithaindraTRS) June 18, 2022