హైదరాబాద్ : విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఆలోచించి.. పాఠశాలల పునః ప్రారంభంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. శనివారం ఆమె బషీర్బాగ్లోని గన్ ఫౌండ్రీ డివిజన్లోని మహబూబియా బాలికల పాఠశాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్, పాఠశాల విద్యా కమిషనర్ దేవసేనతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించి, విద్యార్థుల.. ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ నెల 26 నుంచే ఉపాధ్యాయులు రావాలని ఆదేశించినట్లు చెప్పారు. ఒకటో తేదీ వరకు పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను యుద్ధ పాత్రిపదికన సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని చోట్లా ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారని, ఇదే స్ఫూర్తి ముందు కొనసాగాలన్నారు. సీఎం కేసీఆర్ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆదేశించారని చెప్పారు.
పంచాయతీల పరిధిలో సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయిలో ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో చైర్మన్, కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో మేయర్, కార్పొరేటర్లు పాఠశాలలను సందర్శించి, వసతులు ఇతరత్రా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులను ఉపాధ్యాయులు నిశితంగా గమనించాలని, జ్వరం ఇతర లక్షణాలు ఉంటే దగ్గర లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వైరల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా శానిటైజేషన్ పనులను పరిశీలించి మంత్రి పలు సూచనలు చేశారు. అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తాగునీరు, విద్యుత్, సదుపాయాలపై ఆరా తీశారు.
మరుగుదొడ్లను పరిశీలించి, క్లినింగ్పై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి.. పచ్చదనం, పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలలు ట్రాన్స్పోర్ట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని, బస్లను శానిటైజేషన్ చేయించాలన్నారు. చాలా రోజుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం అవుతుండడంతో ఒకటో తేదీ నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు వాతావరణం అలవాటు పడేలా చూసే బాధ్యత ఉపాధ్యాయులదేనని స్పష్టం చేశారు.