అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి రోజా సెల్ఫోన్ చోరీకి గురైంది. దీంతో గాబరా పడ్డ పోలీసులు ఫోన్ ట్రాక్ ద్వారా గుర్తించి కొద్ది గంటల్లోనే మంత్రి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రోజా ఇవాళ తిరుపతికి వచ్చారు. అక్కడ ఉన్న ఆలయ దర్శనంతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చివరగా క్రీడలపై ఎస్వీ వర్సిటీలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఇక్కడ తన సెల్ఫోన్ కనబడటం లేదని గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ముందుకు కాల్ చేయగా దొంగిలించిన వ్యక్తి కాల్ను లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులు తమ విచారణను మరింత వేగిరం చేశారు. ఫోన్ ట్రాకింగ్ విధానం ద్వారా ఫోన్ ఎస్వీ కళాశాలలోనే ఉందని గుర్తించి ఆ దిశగా విచారణ చేపట్టారు.చివరకు ఎస్వీయూలో ఒప్పంద ఉద్యోగి నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకుని మంత్రికి అందజేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే తనకు ఫోన్ దొరికిందని, దొంగిలించలేదని, మంత్రి ఫోన్ తెలియక ఫోన్ స్విఛ్చాఫ్ చేసి తరువాత ఆన్ చేశానని సదరు ఉద్యోగి పేర్కొన్నాడు.