హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చి మూడు మీటర్లు ఎత్తు పెంచుకున్నారు.. దీని వల్లే భద్రాచలానికి వరద వచ్చిందన్నారు. ఎత్తు తగ్గించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని మంత్రి పేర్కొన్నారు. వరదల నివారణకు ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.
టీఆర్ఎస్ ఎల్పీలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్యే నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ తాత మధుతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
భద్రాచలం ఇరు వైపులా కరకట్టలను పటిష్టం చేసేందుకు, ముంపు బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన చర్యలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంత్రి తెలిపారు. రూ. 1000 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన కేసీఆర్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ఉన్న ముప్పును నివారించాలని డిమాండ్ చేశారు. ఏపీ నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి తమ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని గుర్తు చేశారు. పోలవరం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినప్పుడు తాము నిరసన తెలిపామన్నారు. ఏపీలో విలీనం అయిన 7 మండలాలను తెలంగాణలో కలపాలి. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టి ఆమోదించాలని కోరారు. ముఖ్యంగా భద్రాచలం పక్కనే ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలి. ఆ ఐదు గ్రామాల అంశంపై కేంద్రం ఆలోచించాలని మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు.