హైదరాబాద్ : భద్రాచలం వరద ముంపు బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పక్కనే ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కోరుతున్నాం.. అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల కోసం మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించి, విమర్శించడం సరికాదన్నారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కలిసి పని చేద్దామని విజ్ఞప్తి చేశారు.
ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరమని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. తన మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదన్నారు. భద్రాచలం ప్రజలు, ఆలయం నీట మునగకుండా ఉండాలనేది తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. కరకట్టల నిర్మాణానికి 5 గ్రామాలకు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. విలీన గ్రామాలను కేటాయించాలని కోరితే.. హైదరాబాద్ ఇస్తారా అనటం.. అసందర్భం.. అర్థరహితం అని అజయ్ పేర్కొన్నారు.
భద్రాద్రి రాముడు నీటిలో మునిగితే ఏపీ ప్రజలకైనా బాధే అని అన్నారు. కేసీఆర్తో జగన్ చర్చలకు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు కృషి చేయాలని సూచించారు. భద్రాచలం రాముడు మునగకుండా చూడాలన్నారు. జగన్తో చర్చించి 5 గ్రామాలను ఇప్పించాలని కోరారు. భద్రాచలం పక్కనే ఉన్న ఆ 5 గ్రామాలను కలిపితేనే కరకట్టల నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. తన మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదు. సున్నితమైన అంశాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలి. బేషజాలకు పోకుండా ప్రజా సమస్యలు పరిష్కరించాలని అజయ్ కుమార్ స్పష్టం చేశారు.