బాల్కొండ : కేసీఆర్లో తెలంగాణ ఉద్యమకాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టపైనేనని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతు పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. సుమారు రూ.17.40 కోట్ల వ్యయంతో చేపట్టే పనులను కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. అనంతరం డ్యామ్ కట్టపై అధికారులు, రైతులతో కలిసి కలియతిరిగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని అయిన ఎస్సారెస్పీ సందర్శనకు 1996లో కేసీఆర్ వచ్చారని, అప్పుడు తుప్పు పట్టిన గేట్లను, డ్యామ్పై గుంతలు,సేఫ్టీ వాల్, డ్యామ్ కట్ట బలంగా ఉండే రాళ్లు అస్తవ్యస్తంగా ఉండడాన్ని చూసి, ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవ ఆలయాలు, తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాల తీరు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు.
కట్టలు తెంచుకున్న ఆవేశంతో 1996లోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొదలు పెట్టాలని ఆలోచన చేశారన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న లోతైన ఆలోచన, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ప్రారంభిస్తారన్నారు. నాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతంలో 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని మోసపు మాటలు చెప్పారని గుర్తు చేశారు. ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు ఉంటేనే తోడి పోసుకునే విధంగా కుట్రపూరితమైన డిజైన్లు రూపకల్పన చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో వరద కాలువ ద్వారా నీళ్లు ఇచ్చే ఆస్కారం ఉందని సీఎం కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వివరిస్తే దాన్ని పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. కొండపోచమ్మ సాగర్, హెల్దీవాగు, నిజాంసాగర్ ద్వారా 400 మీటర్ల ఎత్తు నుంచి నీటిని తేవాలని ఆలోచన చేసిన, 2017 లో ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి శ్రీకారం చుట్టారని, దీని ద్వారా కేవలం 40 మీటర్ల ఎత్తు నుంచి వరద కాలువ రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నింపుకుంటున్నమని అన్నారు.
దీని వెనుక ఎంత అంతర్మథనం జరిగిందో ఆయకట్టు రైతులు అర్దం చేసుకోవాలని కోరారు. రైతుల ప్రయోజనాల కోసం కేసీఆర్ ఎంతగా ఆలోచిస్తారో అనే దానికి ఎస్సారెస్పీని నిండు కుండలా నింపుకోవడమే నిదర్శనం అన్నారు. అట్లాగే నేడు సుమారు 42 కోట్లతో డ్యాంమ్కు అన్ని రకాల మరమ్మతులు చేసుకున్నామని, గుంతలు లేకుండా అద్దం లాంటి రోడ్లు వేసుకున్నామని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి దయతో నేడు రూ.17.40 కోట్ల వ్యయంతో గేట్లు మరమ్మతులు చేసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సారెస్పీ సీఈ సుధాకర్ రెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ బాల్కొండ నియోజకవర్గ ఆయకట్టు మండలాల ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.