హైదరాబాద్ : శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ పోచారం మర మనిషి అంటూ ఈటల రాజేందర్.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తనకు 20 ఏండ్ల సీనియార్టీ ఉందని మాట్లాడుతున్న ఈటల.. స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరుస్తూ మాట్లాడటం తీవ్ర విచారకరమని పేర్కొన్నారు. స్పీకర్ తన బాధ్యతలను నిబంధనల మేరకు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయా పార్టీల సభ్యుల సంఖ్యను బట్టి బీఏసీ(శాసనసభా వ్యవహారాల సలహా సంఘం) సమావేశంలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా బీఏసీలో బీజేపీకి అవకాశం లేదనే విషయాన్ని తెలుసుకోవాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు.
ఉమ్మడి ఏపీ అసెంబ్లీ నిబంధనలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మార్చుకున్న సంగతి ఈటలకు తెలియదా అని మంత్రి ప్రశ్నించారు. వార్తల్లో ఉండటానికే ఈటల రాజేందర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ స్పీకర్ సీఎం కనుసన్నల్లో వ్యవహరిస్తే, మరి లోక్సభ స్పీకర్ ప్రధాని మోదీ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు. స్పీకర్ విషయంలో మాట్లాడేముందు సభ్యులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని, స్పీకర్ను అవమానపరిస్తే మొత్తం అసెంబ్లీని అవమానపరిచినట్టే అని మంత్రి వేముల అన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పట్ల ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణిస్తున్నామని, ఒక వేళ క్షమాపణ చెప్పకపోతే స్పీకర్ స్థానం గౌరవాన్ని కాపాడేందుకు సభా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.