కమ్మర్పల్లి, సెప్టెంబర్ 27 : అభివృద్ధి, సంక్షేమాన్ని దేశంలో ఎక్కడా లేనివిధంగా అందిస్తున్న సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని 63వ నెంబరు జాతీయ రహదారిపై రూ.5కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నది ఎవరు.. వట్టి మాటలు చెప్పి రెచ్చగొట్టిపోతున్నది ఎవరు అనేది ప్రజలు గమనించాలని కోరారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత సహకారంతో కమ్మర్పల్లికి ఎనిమిదేండ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ. 25కోట్ల నుంచి రూ.30కోట్ల వరకు పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఆర్టీసి బస్టాండ్ను రూ.40 లక్షలతో సీసీ ఫ్లోరింగ్ చేయించి అద్దంలా తయారు చేశామన్నారు.
తనకన్నా ముందు వచ్చిన వారెవ్వరూ బస్టాండ్ దుస్థితిని మార్చలేదని గుర్తు చేశారు. ఎనిమిదేండ్లలో రూ.3కోట్లతో సీసీ డ్రైనేజీల నిర్మాణం జరిగిందన్నారు. రూ.8 కోట్లతో ఇంటింటికీ నల్లా పెట్టి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీకి రూ.3 కోట్లతో 5వేల మెట్రిక్ టన్నుల గోదాం, రూ.2 కోట్లతో ఆఫీస్, ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. స్థానిక ప్రభుత్వ దవాఖానలో తాను, తన మిత్రులు కలిసి సొంత డబ్బులతో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందేనన్నారు. రూ.4కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కావస్తున్నదన్నారు. ఇక్కడి యువత, క్రీడాకారుల కోరిక మేరకు రూ.3కోట్లతో మినీ స్టేడియం నిర్మించి వారి కల నెరవేర్చానన్నారు. సీడీపీ నిధులతో ప్రజా కల్యాణ మండపం నిర్మాణం పూర్తి అయ్యిందని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఇవన్నీ కమ్మర్పల్లి ప్రజల కండ్ల ముందున్న వాస్తవాలే అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, ఎంపీపీ లోలపు గౌతమీసుమన్, కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుణ్వీర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ మైలారం సుధాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, ఉప సర్పంచ్ పాలెపు చిన్న గంగారాం, వీడీసీ అధ్యక్షుడు బద్దం రాజేశ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చింత గణేశ్, అహ్మద్ హుస్సేన్, అజ్మత్ హుస్సేన్ పాల్గొన్నారు.
నిఖార్సయిన నేత కొండా బాపూజీ
కొండా లక్ష్మణ్ బాపూజీ నిరఖ్సాయిన తెలంగాణవాది అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు కమ్మర్పల్లిలో మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక పద్మశాలీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి ఒక్కడిగా బయల్దేరిన కేసీఆర్ను ఆశీర్వదించి వెన్నుతట్టిన నేత కొండా లక్ష్మన్ బాపూజీ అన్నారు. నిబద్ధత, నిజాయితీ, నిర్భయం కలిగిన నాయకుడిగా, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ గర్వించదగ్గ నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ నిలిచారన్నారు. తనకు కొండా బాపూజీతో స్వయంగా అనుబంధమున్నదన్నారు. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లినప్పుడు కలిసి మాట్లాడే వారమన్నారు. బాపూజీ అంటే కేసీఆర్కు గౌరవమన్నారు. ఆయన జన్మదినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మన్ బాపూజీ, అగ్రికల్చర్ యూనివర్సిటీకి జయశంకర్ సార్ పేరు పెట్టడం ద్వారా కేసీఆర్ వారిని తరతరాలు గుర్తించేలా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత శ్రీకుమార్, పద్మశాలీ సంఘం మండల అధ్యక్షుడు చింత తిరుపతి, కోశాధికారి సిలివేరి వేణుగోపాల్, చింత హన్మంతు, ఫేమస్ లక్ష్మణ్, ధరణి, డాక్టర్ నరేశ్, రవి, రాజుల కృష్ణ, శ్రీకంఠం తదితరులు పాల్గొన్నారు.