హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతు వేదికల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,596 రైతు వేదికలు నిర్మించామని తెలిపారు. రైతు వేదికల నిర్మాణాల కోసం రూ. 572 కోట్ల 22 లక్షల మొత్తాన్ని ఖర్చు చేశామన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖల ద్వారా ఆధునిక వ్యవసాయ సమాచారం, అవగాహన కల్పించడం కోసం, నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా ఈ వేదికలను ఉపయోగిస్తామన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు ఈ వేదికలు ఉపయోగపడుతాయన్నారు. ఇలాంటి వేదికలను ప్రపంచంలో ఎక్కడా నిర్మించలేదన్నారు.
సాగు విస్తీర్ణణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించుకున్నామని తెలిపారు. ఆ తర్వాత రైతులకు పంటల విధానంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర్ తన సొంత నిధులతో రైతు వేదికలను నిర్మించారు. రామాయంపేటలో కేటీఆర్ సతీమణి శైలిమ ఒక రైతు వేదిక నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. తన ఇద్దరు బిడ్డలు కూడా వనపర్తిలో ఒకటి, తమ సొంతూరిలో ఒక రైతు వేదికను నిర్మించి ఇచ్చారు. ఇలా మొత్తం 22 రైతు వేదికలను తమ సొంత నిధులతో పలువురు మంత్రులు ఏర్పాటు చేయించారు అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.