హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ‘కాళేశ్వరం నుంచి ఒక ఎకరాకూ నీళ్లు రాలేదని ఒక పార్టీ ప్రచారం చేస్తది.. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇంకో పార్టీ అంటది. ఎవరికి నచ్చింది.. ఎవరికి తోచింది.. ఎవరికి నోటికి వచ్చింది నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఆది నుంచీ కాంగ్రెస్, బీజేపీ నేతలది ఇదే తీరు’ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే పనిగట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నాదని ధ్వజమెత్తారు. బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, గోదావరి వరదలపై విపక్షాల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
గోదావరికి వచ్చిన వరద కన్నా విపక్షాల కన్నీటి వరద ఎకువయిందని ఎద్దేవా చేశారు. సాగర్ కట్టింది నెహ్రూ, శ్రీశైలం ప్రాజెక్టుకు పునాది వేసింది నెహ్రూ.. కట్టింది నీలం సంజీవరెడ్డి అని చెప్తారని, తెలంగాణకు అన్యాయం చేసే పోతిరెడ్డిపాడు ఎవరు కట్టిండ్రు అంటే రాజశేఖర్రెడ్డి అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా సంకలు గుద్దుకొని చెపుతారని తెలిపారు. కానీ, తెలంగాణ జీవనాడి లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రం ప్రశంసించ బోరని, ఆ పథకానికి రూపకల్పన చేసిన కేసీఆర్ను మాత్రం పనిగట్టుకొని విమర్శిస్తారని మండిపడ్డారు. ప్రాజెక్టు గొప్పతనాన్ని కేంద్ర జల వనరుల నిపుణులే కొనియాడినా వారికి పట్టదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ నేతల అకసుకు అవధులు లేవు .. సొంత ప్రాంతానికి మేలు జరుగుతుంటే వీరిలా ఈర్ష్య పడేవారు ఎవరూ ఉండరని నిప్పులు చెరిగారు.
కాళేశ్వరం నుంచి ఒక ఎకరాకు నీళ్లు రాలేదని ఒకరు మాట్లాడతారు.. కాళేశ్వరానికి ఇప్పటివరకు ఖర్చు చేసిందే రూ.95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, రాష్ట్ర ఇంజనీర్లు, నిపుణులకు అసలు అవగాహనే లేనట్టు కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 500 ఏళ్ల తర్వాత వచ్చిన అత్యంత తీవ్ర వరదలని కేంద్ర జలసంఘమే వెల్లడించిందని, హై ఫ్లడ్ లెవెల్ను దాటి 108.19 మీటర్లు వరద వచ్చిందని వివరించారు. ఎత్తిపోతల పథకాలకు, ప్రాజెక్టులకు తేడా తెలియకుండా కాంగ్రెస్ , బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీశైలం 1998లో, 2009లో మునిగిందని, కల్వకుర్తి ఎత్తిపోతల రెండుసార్లు మునిగిందని గుర్తుచేశారు. అయినప్పటికీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశ, విదేశాల ఇంజినీరింగ్ ప్రముఖులు పెంటారెడ్డి సలహాలు తీసుకుంటారని, తెలంగాణ తొలి ఎత్తిపోతల పథకం ఎలిమినేటి మాధవరెడ్డి స్కీమ్ను ఆంధ్రా ఇంజినీర్ల కుట్రలను ఛేదించి విజయవంతంగా నిర్మించారని గుర్తుచేశారు. పెంటారెడ్డి వంటి నిపుణుడిని విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదని, నేల తడిచి, పంట పండి, ఆ ప్రాజెక్టు నీళ్లు తాగిన ప్రజలే సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు.
దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయండి..
కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేం ద్రం జాతీయ హోదా ఇచ్చిందని, బీజేపీ నేతల కు దమ్ముంటే తెలంగాణ ప్రాజెక్టులకు ఆ హోదా తీసుకురావాలని మంత్రి నిరంజన్రెడ్డి సవాల్ విసిరారు. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక యోచిస్తున్నదని కాంగ్రెస్, బీజేపీ నేతలకు చేతనైతే తెలంగాణ సర్కారు, కేసీఆర్ను విమర్శించడం మాని కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.