హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ)/కొణిజర్ల: యాసంగిలో పత్తి సాగుతో ఎంతో మేలని, రైతులు వానకాలంతో పాటు యాసంగిలోనూ పత్తి సాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అవసరమైన సాగునీటి వనరులు, 24 గంటల ఉచిత విద్యుత్తు అందుబాటులో ఉన్నదని, యాసంగిలో పత్తి సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం బస్వాపురం గ్రామానికి చెందిన యువ రైతు మల్లెంపాటి వెంకటేశ్వర్లు యాసంగిలో విజయవంతంగా పత్తి సాగు చేసి మంచి ఫలితాలు రాబట్టారని వెల్లడించారు. పత్తి సాగులో ఆయన నూతన అధ్యాయానికి నాంది పలికారని కితాబిచ్చారు.
వినూత్నంగా ఆలోచించిన వెంకటేశ్వర్లు రాష్ట్ర రైతాంగానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. మంగళవారం యువ రైతు ఇంటికి వెళ్లిన మంత్రి.. రైతును, అతడి కుటుంబసభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిరప నష్టంతో పత్తి వైపు మళ్లిన వెంకటేశ్వర్లు మంచి లాభాలు సాధించారని చెప్పారు. రైతులకు ఆదర్శంగా నిలిచిన ఈ రైతన్నను అభినందించటానికి తానే స్వయంగా వచ్చానని వెల్లడించారు. పంట వైవిధ్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నదని వివరించారు. ఇక్కడి భూములు పత్తి సాగుకు అత్యంత అనుకూలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, మారెట్ చైర్మన్ లక్ష్మీప్రసన్న, రాశి సీడ్స్ ప్రతినిధులు ఎఎస్ఎన్ రెడ్డి, రమణకుమార్ పాల్గొన్నారు.