ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్లోని బీడీ ఎన్టీ ల్యాబ్ను కేటీఆర్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులతో కేటీఆర్ మాట్లాడారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రూరల్ టెక్నాలజీ పాలసీ వల్ల ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్ లాంటి నగరాల్లో ఇప్పటికే ఐటీ పార్కులను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోందన్నారు. ఆదిలాబాద్ లాంటి పట్టణాలకు ఐటీ విస్తరించడం సంతోషకరమైన విషయమన్నారు. ఇక్కడి ఉద్యోగులు అమెరికా కంపెనీలతో పని చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీడీ ఎన్టీ ల్యాబ్ భవనం కోసం రూ. 1.50 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. మూతపడిన సీసీఐని తెరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తామన్న పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సిమెంట్ వినియోగం పెరిగి ప్రయివేటు పరిశ్రమలు లాభాల్లో నడుస్తున్నాయని గుర్తు చేశారు. సీపీఐని ప్రారంభించడానికి అన్ని అవకాశాలు ఉన్న కేంద్ర నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కాశ్మీరంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.